
పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చారు. అమరావతి బోన్సాయ్ సొసైటీ కమిటీ ఆధ్వర్యంలో కె.ఎం.వి. వివాన్ అసోసియేషన్, కె.ఎం.వి. స్పేసస్ సహకారంతో కెఎంవి వివాన్లో ఏర్పాటు చేసిన బోన్సాయ్ మొక్కల పెంపకం పట్ల అవగాహన ప్రదర్శన కార్యక్రమాన్నికి కలెక్టర్ నివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ ముడిపడి ఉందన్నారు.
పర్యావరణాన్ని కాపాడుకోపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో బోన్సాయి మొక్కలను మనం పెంచగలిగితే కొంతవరకు కాలుష్యాన్ని నియంత్రించవచ్చని తెలిపారు. మొక్కల పెంపకం, సంరక్షణతో ముఖ్యంగా ఆహ్లాదాన్ని పంచుకోవచ్చని ఆయన సూచించారు. మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతాయి.
మొక్కలను సంరక్షించండి అనే నినాదంతో అమరావతి బోన్సాయి సొసైటి కమిటి తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను కలెక్టర్ అభినందించారు. ప్రదర్శనలో భాగంగా నిర్వహించిన వర్క్షాప్లో ఏర్పాటు చేసిన వివిధ రకాల మొక్కలను బోన్సాయి మొక్కగా ఏ విధంగా తీర్చిదిద్దుకోవచ్చో పేర్కొంటూ ప్రజలకు మొక్కల పెంపకం, సంరక్షణ నిపుణులతో అవగాహన కల్పిస్తున్నట్లు అమరావతి బోన్సాయ్ అసోసియేషన్ అధ్యక్షురాలు అమృతకుమార్, ఉపాధ్యక్షురాలు యెర్నేని పద్మజ తెలిపారు.
ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ రకాల బోన్సాయ్ మొక్కలు పర్యావరణ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని పేర్కొన్నారు. మొక్కల పెంపకంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నిర్వాహకులు వారికి సభ్యత్వాన్ని కల్పించినట్లు చెప్పారు. బోన్సాయ్ మొక్కల పెంపకం పట్ల అవగాహన ప్రదర్శన ఆదివారం కూడా కొనసాగనుందని తెలిపారు. కార్యక్రమంలో అమరావతి బోన్సాయ్ అసోసియేషన్ కార్యదర్శి పత్తి నాగలక్ష్మి, జాయింట్ సెక్రటరీ గమిని సునీత, కోశాధికారి దుర్గా సౌజన్య కంచర్ల, కె.ఎం.వి. స్పేసస్ డైరెక్టర్ కె.పృధ్వీరామ్, కె.ఎం.వి. స్పేసస్ మార్కెటింగ్ హెడ్ ప్రసాద్ వల్లూరి, కేఎంవి వివాన్ అసోసియేషన్ అధ్యక్షురాలు టి.అఖిలాండేశ్కరి రాణి, కార్యదర్శి వై.వెంకటేష్, మొక్కల ప్రేమికులు, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి బోన్సాయ్ మొక్కల పట్ల విశేష ఆసక్తి కనబరిచారు.